www.ntodaynews.com
అప్పు తీరినా వదలని మృత్యువు
తెలంగాణ
/
నల్గొండ
/
నార్కెట్ పల్లి
అప్పు తీరినా వదలని మృత్యువు
వడ్డీ వ్యాపారి దాడిలో వ్యక్తి మృతి
NTODAY NEWS : నార్కెట్ పల్లి
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూళ్ల విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఓర్సు శంభులింగం (60) మరియు సుర ఆంజనేయులు మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన ఆంజనేయులు శంభులింగంపై భౌతిక దాడికి దిగాడు.
దాడిలో శంభులింగం ఛాతీపై బలమైన దెబ్బలు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శంభులింగం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో పెద్దమనుషుల సమక్షంలో ₹80 వేల అప్పును పూర్తిగా చెల్లించినప్పటికీ, ఇంకా డబ్బులు ఇవ్వాలని ఆంజనేయులు వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. కావాలనే ఇంటికి పిలిపించి శంభులింగంపై దాడి చేశాడని వారు పేర్కొన్నారు.
సుర ఆంజనేయులు గతంలో కూడా అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.
#Narketpally #CrimeNews #NalgondaDistrict #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube