ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. రైస్ మిల్లుల్లో దిగుమతులు త్వరగా పూర్తి చేయాలి
హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హాజీపూర్ మండలం గుడిపేట, నమ్నూర్ లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఎస్.ఆర్.ఎం, గాయత్రి రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు మరియు దిగుమతి ప్రక్రియలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. హమాలీల కొరతను అధిగమించడానికి స్థానిక హమాలీలను వినియోగిస్తున్నామని, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా పెద్దపల్లి, కరీంనగర్ లలో గోదాములను సిద్ధం చేశామని చెప్పారు. ధాన్యం రవాణాకు ట్రాక్టర్లను కూడా అనుమతించామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట కొనుగోలుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
లక్షెట్టిపేటలో రైస్ మిల్లుల పరిశీలన..
సీఎంఆర్ గడువులోగా పూర్తి చేయాలి అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జై యోగేశ్వర రైస్ మిల్లును స్థానిక తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. అక్కడ ధాన్యం దిగుమతి మరియు సీఎంఆర్ ప్రక్రియలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు చేరిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా దిగుమతి చేసుకోవాలని మిల్లుల నిర్వాహకులను ఆదేశించారు. నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు, మిల్లుల యజమానులు పూర్తి సమన్వయంతో కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో స్థానిక అధికారులు, కొనుగోలు కేంద్రాల బాధ్యులు, రైస్ మిల్లుల నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు