ధర్మపురిలో రంజాన్ తోఫా పంపిణీ..
ధర్మపురిలో రంజాన్ తోఫా పంపిణీ.. మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి: కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను, మతాలను గౌరవించే అసలైన సెక్యులర్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్లో ముస్లిం సోదర సోదరీమణులకు నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లిం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తోఫా పంపిణీని చేపట్టారని తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 2,050 మందికి రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు వెల్లడించారు.
మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ధర్మపురి అభివృద్ధిపై హామీలు:
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ధర్మపురికి భారీగా నిధులు తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రితో చర్చించి, ధర్మపురి బస్ డిపో మంజూరుకు కృషి చేస్తానని, పుష్కరాల లోపు డిపో నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని వివరించారు.
మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల లావణ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.