గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను: గ్రామ గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అయ్యంకి వెంకటరమణయ్య 1934 నుంచి 1948 మధ్య కోస్తా ఆంధ్రలో అనేక గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేశారని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి, పత్రికా సంపాదకుడిగా కూడా విశిష్ట గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని వివరించారు.
హైస్కూల్ పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు రాయల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి అయ్యంకి వెంకటరమణయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అనే సందేశాన్ని గ్రంథాలయ యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి చదువుపై చైతన్యం కల్పించిన మహనీయుడిగా ఆయన నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, గ్రంథాలయ అభిమానులు పాల్గొని అయ్యంకి వెంకటరమణయ్యకు ఘన నివాళులు అర్పించారు.