గురుదక్షిణగా కారును అందించిన పూర్వ విద్యార్థి.. భావోద్వేగానికి గురిచేసిన ఘటన
కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా కుమారేశ్వర స్కూల్లో ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్కు చేరుకున్న ఓ ఉపాధ్యాయుడికి ఆయన పూర్వ విద్యార్థి గురుదక్షిణగా కారు బహుమతిగా అందించాడు.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన నవీన్ అనే బాలుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ ఉపాధ్యాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి బాలుడిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. అంతే కాకుండా అతని చదువుకు నిరంతరం అండగా నిలిచి ఎంటెక్ పూర్తయ్యే వరకు ప్రోత్సహించారు.
తరువాత నవీన్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తన జీవితాన్ని మలిచిన గురువు రిటైర్మెంట్కు చేరుకున్నారని తెలిసి స్వదేశానికి వచ్చి, గురుదక్షిణగా కారు అందించాడు.
ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు హాజరై ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల జీవితాలను మలిచిన ఆ గురువు సేవా భావానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.