ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి..
ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. యూపీని వణికించిన తుఫాను !
ఉత్తరప్రదేశ్లో ప్రకృతి ప్రళయం సృష్టించింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో రాష్ట్రం అతలాకుతలమైంది. బరేలీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో షాక్కు గురిచేస్తోంది.
50 ఏళ్ల వ్యక్తి రేకుల షెడ్డుపై ఉండగా.. ఒక్కసారిగా బలమైన గాలి వీచడంతో షెడ్డుతో సహా గాల్లోకి ఎగిరిపోయాడు. దాదాపు 50 అడుగుల ఎత్తుకు లేచిన అతడు.. 100 మీటర్ల దూరంలో ఉన్న పొలంలో పడిపోయాడు. ఈ ఘటనలో అతని చేయి విరిగింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బుధవారం ఉదయం నుంచి రాత్రివరకు యూపీ అంతటా విరుచుకుపడిన తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. చెట్లు నేలకొరిగాయి.. ఇండ్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది.
తుఫాను కారణంగా ఇప్పటివరకు కనీసం 89 మంది మృతి చెందినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మృతుల సంఖ్య వంద దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రయాగ్రాజ్లో 21 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, ఫతేపూర్లో 11 మంది, మీర్జాపూర్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్, బదౌన్, బరేలీ, ప్రతాప్గఢ్ సహా అనేక జిల్లాల్లో గోడలు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం, ఇళ్లు ధ్వంసం కావడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.
గాలి దుమారం, దుమ్ముధూళి తుఫానుతో ఉత్తరప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.