కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే అభివృద్ధియా?
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే అభివృద్ధియా? – మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి, కేవలం కూల్చివేతలపైనే తన ప్రతాపాన్ని చూపుతోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూలుస్తుంటే, మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అదే పంథాను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల గూడు చెడగొడుతూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు చేస్తున్న బెదిరింపులకు ప్రజలెవరూ భయపడవద్దని, అధికార గర్వంతో విర్రవీగుతున్న వారిని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలంతా కలిసి ఎండగట్టాలని ఆయన కోరారు