లక్షెట్టిపేటలో ఘనంగా వానమహోత్సవం
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్
స్థానిక ఐబీ ప్రాంగణంలో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమం
లక్షెట్టిపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'వానమహోత్సవం' సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ హాజరై మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి చెట్టుగా పెంచినప్పుడే వానమహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సత్యనారాయణ, రాజు, తోట సువర్ణ రవి, చంద్రమౌళి, కో-ఆప్షన్ సభ్యులు చింత సువర్ణ అశోక్ కుమార్, తబస్సుమ్ హజీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు