లోన్ల పేరిట మోసం ఇద్దరు మహిళలపై కేసు నమోదు
రుణాలు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు మహిళలపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను సీఐ ప్రమోద్ రావు శనివారం వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం... ఇక్బాల్ అహ్మద్ నగర్ కు చెందిన బద్రున్నిసా, మరియు గోపాలవాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి అనే ఇద్దరు మహిళలు సులభంగా లోన్లు ఇప్పిస్తామని నమ్మబలికారు. రూ. 5 లక్షల లోన్ ఇప్పిస్తామంటూ దాదాపు పది మంది బాధితుల నుండి విడతల వారీగా మొత్తం రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు.
డబ్బులు తీసుకుని ఎంతకాలమైనా లోన్ రాకపోవడంతో, బాధితులు సదరు మహిళలను నిలదీశారు. అయితే వారి నుంచి ఎటువంటి సరైన సమాధానం రాకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం బాధితురాలు షేక్ రిజ్వానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు