వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును రికవరీ చేసి అప్పగింత
వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును రికవరీ చేసి అప్పగింత
మధిర: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మధిర పట్టణ పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. పొరపాటున రోడ్డుపై రూ. 25 వేల నగదు పోగొట్టుకున్న ఓ వృద్ధురాలికి, సిసి కెమెరాల సాయంతో ఆ సొమ్మును తిరిగి అప్పగించి బాధితురాలి కళ్లలో ఆనందం నింపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధిర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన దారమల్ల కనకమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం ఉదయం పట్టణంలోని ఆకృతి వస్త్ర దుకాణం సమీపంలో టీ తాగేందుకు వెళ్ళింది. ఆ సమయంలో ఆమె వెంట తెచ్చుకున్న రూ. 25,000 నగదు పొరపాటున రోడ్డుపై పడిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో డబ్బులు లేవని గుర్తించిన ఆమె, టీ షాపు వద్దకు వచ్చి వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో బాధితురాలు మధిర పట్టణ సీఐ దోమల రమేష్ కి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ.. బ్లూకోట్ సిబ్బంది బాణావత్ కొండ మరియు హోంగార్డ్ మధులను రంగంలోకి దింపారు. వారు ఆ ప్రాంతంలోని సిసి కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, రోడ్డుపై పడి ఉన్న నగదును తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. అతని నుండి నగదును రికవరీ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.
అనంతరం సీఐ దోమల రమేష్, ఎస్సై నవిత మరియు బ్లూకోట్ సిబ్బంది సమక్షంలో ఆ రూ. 25,000 నగదును వృద్ధురాలు కనకమ్మకు అప్పగించారు. తన కష్టార్జితాన్ని తక్షణమే వెతికి పెట్టినందుకు కనకమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి నగదును రికవరీ చేసిన బ్లూకోట్ కానిస్టేబుల్ కొండ మరియు హోంగార్డ్ మధులను సీఐ అభినందించారు.