మమతకు షాక్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత
కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా అసెంబ్లీ సిబ్బంది రితబ్రతకు అందజేశారు.
ఇటీవల అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్దేబ్ ఛటోపాధ్యాయ్ను ఎంపిక చేయడంపై టీఎంసీలో విభేదాలు బయటపడ్డాయి. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. అనంతరం రితబ్రత నేతృత్వంలోని ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి, తమకే మెజారిటీ మద్దతు ఉందని, రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ రితబ్రతకు ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. అయితే, తాము ఇంకా మమతా బెనర్జీ నాయకత్వాన్నే అంగీకరిస్తున్నామని రితబ్రత స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
మరోవైపు, శోభన్దేబ్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పీకర్కు లేఖ రాశారు. అయితే, ఆ లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్ ఆరోపించడంతో స్పీకర్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో శోభన్దేబ్కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు.