ముల్కల్ల ఇసుక రీచ్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక తరలింపు ఓటీపీ లేని ట్రాక్టర్లకు అనుమతి లేదు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఇసుక రీచ్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మన ఇసుక వాహనం' యాప్ ద్వారా అధికారికంగా ఇసుకను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుకను తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను రవాణా చేసినట్లైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ఇసుక రవాణాలో పారదర్శకతను పాటించాలని, ఓటీపీ లేని ఏ ఒక్క ట్రాక్టర్ కూడా ఇసుక రీచ్ నుంచి బయటకు వెళ్లకూడదని కలెక్టర్ అధికారులను కచ్చితంగా ఆదేశించారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి అక్రమాలను అరికట్టాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు