ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు..
ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత
ములుగు జిల్లా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తవ్వకాల్లో కాకతీయుల కాలం నాటి పురాతన శిలలు బయటపడిన క్రమంలో, వాటి సమీపంలో మూడు తెల్ల రంగు పాములు కనిపించాయని కార్మికులు తెలిపారు.
రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, భారీ రాళ్లు అడ్డుగా రావడంతో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. ఆ రాళ్లు పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిలలుగా గుర్తించినట్లు సమాచారం.
అదే సమయంలో మూడు తెల్ల పాములు బయటకు వచ్చాయని, వాటిలో ఒకటి జేసీబీ బకెట్ తగలడంతో మృతి చెందిందని చెబుతున్నారు. మిగిలిన రెండు పాములు అక్కడి నుంచి వెళ్లిపోయాయని సమాచారం.
ఈ ఘటన అనంతరం జేసీబీ యంత్రం అకస్మాత్తుగా మొరాయించడంతో సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. సాంకేతిక లోపమా లేదా యాదృచ్ఛిక సంఘటననా అనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరిస్థితిని గమనించిన కాంట్రాక్టర్ సిబ్బంది తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. బయటపడిన శిలల ఆధారంగా అక్కడ పురాతన ఆలయ అవశేషాలు ఉండే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.
ఈ అంశంపై పురావస్తు శాఖ పరిశీలన అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.