నకిరేకల్ అభివృద్ధిపై చిరుమర్తి లింగయ్య సూటి ప్రశ్నలు
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నార్కట్పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ 100 పడకల ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసి, దాదాపు 80 శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి వైద్య సేవలు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందులు, పరికరాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉదయ సముద్రం, అయిటిపాముల లిఫ్ట్, సెంట్రల్ లైటింగ్ డివైడర్లు, నకిరేకల్ డిగ్రీ కళాశాల, సమీకృత మార్కెట్లు, రామన్నపేట ఏరియా ఆసుపత్రి తదితర గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిరేకల్ నియోజకవర్గానికి కొత్తగా మంజూరు చేసిన అభివృద్ధి పనులు, నిధుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు కొత్త రంగులు వేసి తమ ప్రభుత్వం సాధించినట్లుగా ప్రచారం చేయకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో నకిరేకల్కు వస్తున్న రేవంత్రెడ్డికి స్వాగతం పలుకుతున్నామని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.