నక్సల్స్ హింసపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గతంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయని, అప్పటి ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ వాహనాలు వెళ్లినా బుల్లెట్ల వర్షం కురిసేదని, అయితే 2014 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు.
నక్సల్ టెర్రరిజం ప్రస్తుతం అంతిమ దశకు చేరుకుందని, నక్సల్స్ ప్రభావిత జిల్లాలను తమ ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించి అభివృద్ధి బాట పట్టించిందన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు వృద్ధికి ఇంజిన్లుగా మారాయని చెప్పారు.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని, అంతర్జాతీయంగా విశ్వసనీయ శక్తిగా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్మించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని అన్నారు.
దిల్లీలో సోమవారం జరిగిన రిపబ్లిక్ సమ్మిట్–2026లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.