ఒకే వ్యక్తి… రెండు ప్రభుత్వ ఉద్యోగాలు… 33 ఏళ్ల భారీ మోసం బట్టబయలు!
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థనే ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఒక సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. జయప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, దాదాపు 33 సంవత్సరాల పాటు రెండు శాఖల నుంచి జీతాలు, ప్రయోజనాలు దోచుకున్న విషయం బయటపడటం కలకలం రేపుతోంది.
ఈ దందా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (ఆర్టిఐ) ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం. సాధారణంగా కనిపించే ఉద్యోగి వెనుక ఇంత పెద్ద మోసం దాగి ఉండటం అధికారులను సైతం షాక్కు గురిచేసింది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, బరాబంకి జిల్లాకు చెందిన ప్రభాత్ సింగ్ 2009 ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. సత్రిఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాశ్ సింగ్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపించారు.
దర్యాప్తులో బయటపడ్డ విషయాలు మరింత షాకింగ్గా మారాయి. జయప్రకాశ్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్గఢ్లో ‘నాన్ మెడికల్ అసిస్టెంట్’గా ఉద్యోగంలో చేరగా, 1993 జూన్లో బరాబంకి జిల్లాలో ప్రాథమిక విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా కూడా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి రెండు ఉద్యోగాలను సమాంతరంగా నిర్వహిస్తూ, రెండు శాఖల నుంచి జీతాలు అందుకుంటూ వచ్చాడు.
పోలీసుల దర్యాప్తు అనంతరం చార్జ్షీట్ దాఖలు కాగా, సాక్ష్యాలు, వాదనలు సమీక్షించిన సుధా సింగ్ నేతృత్వంలోని కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. చివరకు అతనికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ ఘటన ప్రభుత్వ వ్యవస్థలో పర్యవేక్షణ లోపాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో స్పష్టంగా చూపించింది. అదే సమయంలో, పారదర్శకత కోసం ఆర్టిఐ వంటి చట్టాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది.