పాలకుర్తి నియోజకవర్గంలో వైద్య సదుపాయాల అభివృద్ధిపై చర్చ
కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి
పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హైదరాబాద్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆరోగ్య సదుపాయాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం కేవలం 7 పడకలతో మాత్రమే సేవలందిస్తోందని, పెరుగుతున్న జనాభా మరియు రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ మార్పు వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబంధిత అధికారులతో చర్చించి ఆసుపత్రి అప్గ్రేడేషన్కు అవసరమైన చర్యలు తీసుకుంటామని, మంజూరుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.