పెనుగొలను బీసీ పాఠశాలలో ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. అనూష మాట్లాడుతూ, సామాజిక వివక్షను ఎదుర్కొన్నప్పటికీ గుర్రం జాషువా తన కవిత్వాన్ని సమాజ చైతన్యానికి ఆయుధంగా మలిచారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై ధైర్యంగా పోరాడి, ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే అనంతరం గౌరవాలు అందుకున్న మహనీయుడిగా నిలిచారని కొనియాడారు.
జాషువా రచించిన 'గబ్బిలం', 'ఫిరదౌసి', 'క్రీస్తు చరిత్ర' వంటి రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. అలాగే 'సత్య హరిశ్చంద్ర' నాటకంలోని కాటిసీను పద్యాలు నేటికీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని తెలుగు నాటక రంగంలో మార్మోగుతున్నాయని వివరించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, గుర్రం జాషువాకు కవి కోకిల, నవయుగ చక్రవర్తి, కవితా విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మభూషణ్ వంటి గౌరవాలు లభించాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జి. లక్ష్మి, విద్యార్థులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.