పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన
జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం – జూన్ 9న రాస్తారోకోలు
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటివరకు నాలుగు సార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. మరోసారి ధరలు పెంచబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ధరల పెరుగుదలను నిరసిస్తూ జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలియజేయనున్నారు.
కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాసర్లపూడి ప్రాంతాన్ని వామపక్షాల బృందం జూన్ మొదటి వారంలో పర్యటించనుంది.
ప్రధాన డిమాండ్లు
పెట్రోలు, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి.
కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలి.
రష్యా, ఇరాన్ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లు కొనసాగించాలి.
కమర్షియల్ గ్యాస్ను పాత ధరలకే అందించాలి.
ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు (సిపిఎం), హరినాథ్ రెడ్డి (సిపిఐ), చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పొలారి (సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరినాథ్ (సిపిఎంఎల్ లిబరేషన్), గణేష్ బాబు ఎంసిపిఐ(యు) పాల్గొన్నారు.
ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ, ఎస్యుసిఐ(సి) పార్టీలు సమావేశ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటించాయి.