పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారుల హక్కులు ఇవే..!
రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపితే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే చట్టం ప్రకారం పోలీసులకు ఉన్న అధికారాలతో పాటు వాహనదారులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి.
వాహనాన్ని ఆపిన అధికారి యూనిఫాంలో ఉండటంతో పాటు నేమ్ ట్యాగ్ ధరించి ఉండాలి. ఒకవేళ యూనిఫాంలో లేకపోతే గుర్తింపు కార్డు చూపించాలని అడిగే హక్కు వాహనదారుడికి ఉంటుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానా విధించినప్పుడు అధికారులు తప్పనిసరిగా అధికారిక రసీదు ఇవ్వాలి. రసీదు లేకుండా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వంటి పత్రాలను తప్పనిసరిగా ఒరిజినల్ రూపంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. డిజీలాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్లో ఉన్న డిజిటల్ పత్రాలను చూపించినా చెల్లుబాటు అవుతాయి. వాటిని ట్రాఫిక్ పోలీసులు అంగీకరించాలి.
వాహనదారుడిని ఆపినప్పుడు కారణం ఏమిటో అడిగే హక్కు కూడా ఉంటుంది. చలానా లేదా ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో వాహనదారులు కూడా పోలీసులకు సహకరించడం, అవసరమైన పత్రాలు చూపించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలి.
చట్ట నిబంధనలపై పూర్తి అవగాహన ఉండటం వల్ల అనవసర ఇబ్బందులు, అపోహలు, వివాదాలను నివారించవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.