ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించిన వారిపై రూ.7.91 లక్షల ఫైన్
ఆహార నియమాలు పాటించకపోతే కఠిన చర్య తీసుకుంటామన్న అడిషనల్ కలెక్టర్ జి శ్రీనివాస్
నల్గొండ: జిల్లాలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన 20 అడ్జుడికేషన్ కేసులపై విచారణ చేపట్టారు. ఈ విచారణ అనంతరం నిందితులకు మొత్తం రూ.7.91 లక్షల జరిమానా విధిస్తూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు రిటైల్ షాపులు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, మిల్క్ సెంటర్లు మరియు వివిధ ఆహార తయారీ యూనిట్లపై ఈ చర్యలు తీసుకున్నారు. సహాయ ఆహార నియంత్రణ అధికారి వి. జ్యోతిర్మయి నేతృత్వంలో ఈ విచారణ సాగగా, జిల్లా ఆహార భద్రతాధికారి ఎన్. శివశంకర్ రెడ్డి కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించారు. ప్రతి ఆహార వ్యాపారి ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఫుడ్ సేఫ్టీ శాఖ నిరంతరం శ్రమిస్తుందని, భవిష్యత్తులో కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.