రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రి డీఎస్ హెచ్ పరిధిలోకి
నేరుగా నిధులు.. నియామకాలు
రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రి డీఎస్ హెచ్ పరిధిలోకి
NTODAY NEWS | భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కొనసాగుతున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీపీవీ)ను రద్దు చేస్తూ, దానిని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్ హెచ్) పరిధిలోకి తీసుకువచ్చే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు మరియు ప్రాంతీయ ఆసుపత్రుల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ ప్రాంతీయ ఆసుపత్రులు ఇప్పటివరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాగగా, తాజాగా ఈ బిల్లుతో అవి డీఎస్ హెచ్ పరిధిలోకి మారనున్నాయి. జిల్లాలోని మూడు సీహెచ్సీలలో కలిపి సుమారు 197 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ తరహాలో ఉన్న టీవీపీవీ కింద పనిచేసిన సిబ్బంది ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ట్రెజరీ ద్వారా వేతనాలు, ఇతర ప్రయోజనాలు పొందనుండటం గమనార్హం. ఈ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఆసుపత్రులకు ప్రత్యేక గ్రాంట్ల రూపంలో నిధులు కేటాయించి, వాటిని ఆసుపత్రుల సొంత బ్యాంకు ఖాతాల ద్వారా వినియోగించే విధానం ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో నిధుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం డీఎస్ హెచ్ పరిధిలోకి మార్పుతో నిధులు నేరుగా ప్రభుత్వం నుంచి విడుదల కావడం వల్ల పరిపాలన మరింత సులభతరం కానుంది. రాష్ట్రస్థాయిలో డైరెక్టర్ ఆధ్వర్యంలో అన్ని పరిపాలనా వ్యవహారాలు నిర్వహించబడతాయి.
ఈ మార్పులతో ఆసుపత్రుల్లో వసతుల పెంపు, పడకల సంఖ్య పెంపు, ఆధునిక వైద్య సేవల అందుబాటు వంటి అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే సిబ్బంది నియామకాలను రాష్ట్రస్థాయిలో ఆమోదించి త్వరితగతిన చేపట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం రామన్నపేటలో 50 పడకలు, చౌటుప్పల్లో 100 పడకలు, ఆలేరు ప్రాంతీయ ఆసుపత్రిలో 30 పడకలతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మార్పుల తర్వాత ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా భువనగిరి జనరల్ ఆసుపత్రి మరియు యాదాద్రి వైద్య కళాశాల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొనసాగుతున్నాయి. అక్కడ వైద్యుల నియామకం నుంచి చికిత్సల నిర్వహణ వరకు అన్ని అంశాలు డీఎంఈ అనుమతితో జరుగుతున్నాయి. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 94 పల్లె దవాఖానాలు, నాలుగు బస్తీ దవాఖానాలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి.
మొత్తంగా ఈ నిర్ణయం ద్వారా ఆసుపత్రుల పరిపాలన మరింత పారదర్శకంగా మారడంతో పాటు, నిధుల వినియోగం వేగవంతమై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశాలు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.