సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్నారా..? 2027 నుంచి కొత్త నిబంధనలు..!
సైబర్ మోసాల బాధితులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కొత్త పరిహార విధానాన్ని తీసుకురానుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, డిజిటల్ మోసాల్లో రూ.50 వేల లోపు నష్టం జరిగిన వారికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు లేదా నష్టపోయిన మొత్తంలో 85 శాతం వరకు పరిహారం అందించే అవకాశం ఉంది.
అయితే ఈ సౌకర్యం పొందాలంటే బాధితులు మోసం జరిగిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు 1930 హెల్ప్లైన్కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన తర్వాత అర్హులైన వారికి పరిహారం అందజేయనున్నారు.
ఇక కస్టమర్ ఎలాంటి ఓటీపీ, పాస్వర్డ్ లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే ఖాతా నుంచి డబ్బులు మాయమైతే, ఆ నష్టానికి బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అయితే లక్షల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు ఎలాంటి పరిహారం అందిస్తారనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై ఆర్బీఐ నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
గుర్తుంచుకోండి: సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయడం, వెంటనే ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.