సీనియారిటీ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి నిర్మాణ రంగాన్ని కాపాడాలి!
కాంట్రాక్టర్లను కాపాడండి – తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాపాడండి
జూన్ 18న నిర్వహించే "చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బి.ఎ.ఐ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహమాన్ ఒక ప్రకటనలో పేర్కొంటూ, దేశంలోనే అత్యంత పురాతనమైన బి.ఎ.ఐ సంస్థ గత 85 సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖలలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందని, దీనివల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం తమ అభ్యర్థనలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరమని, ఈ బిల్లుల ఆలస్యం వల్ల కేవలం కాంట్రాక్టర్లే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఇంజినీర్లు, కార్మికులు మరియు సరఫరాదారుల కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని బి.ఎ.ఐ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఎలాంటి సిఫార్సులు, వివక్ష లేకుండా "ముందు వచ్చిన బిల్లుకే ముందు చెల్లింపు" అనే పారదర్శక క్రమ సంఖ్య సూత్రాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి భాగస్వాములమేనని, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ, కాంట్రాక్టర్ల హక్కుల సాధన కోసం 2026 జూన్ 18న హైదరాబాద్లో నిర్వహించే "చలో హైదరాబాద్" కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగానికి చెందిన భాగస్వాములు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిరాజ్ ఉర్ రహమాన్ పిలుపునిచ్చారు. మానవీయ కోణంలో పెండింగ్ బిల్లులను విడుదల చేసి నిర్మాణ రంగాన్ని, తద్వారా రాష్ట్ర ప్రగతిని కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు