శ్రీశైలం ధర్మకర్తలు మండలి సమావేశం
శ్రీశైలం ధర్మకర్తలు మండలి సమావేశం
కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
తేది: 25.03.2026
బుధవారం (25.03.2026) దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడుగారి అధ్యక్షన ధర్మకర్తల మండలి 5వ సమావేశం నిర్వహించబడింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈనాటి సమావేశంలో మొత్తం 28 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 23 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా వాటిలో 4 అంశాలను వాయిదా వేయడం జరిగింది. ఒక అంశం తిరస్కరించబడింది.
సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడు వివరించారు.
• క్షేత్రంలో సందర్శించే సామాన్యభక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి సమావేశంలో కూలంకుషంగా చర్చించడం జరిగింది.
• క్షేత్రాభివృద్ధి మరియు సౌకర్యాల కల్పనకుగాను రాబోవు 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన మాస్టర్ప్లాన్ తుదిరూపం ఇచ్చేందుకై నిర్ధారణకు డి.పి.ఆర్ ( DETAILED PROJECT REPORT) పరిశీలించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
• ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాలకు సంబంధించి అనగా డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు మొదలైనవాటికి మొదటి ప్రాధాన్యతను మాస్టరుప్లానులో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
• అదేవిధంగా శ్రీశైలక్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా మాస్టర్ ప్లానులో పొందుపరచాలని నిర్ణయించడం జరిగింది.
• మాస్టర్ ప్లాన్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్ర సుందరీకరణకు కూడా తగు చర్యలు చేపట్టేవిధంగా ఆయా అంశాలను మాస్టరుప్లానులో పొందుపరిచేందుకు నిర్ణయం గైకొనబడింది.
• మల్లమ్మ కన్నీరు సమీపంలో గల పురాతన కాలభైరవ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది.
• పరిపాలనాంశాలలో భాగంగా గో సంరక్షణశాలలోని గోవులకు గ్రాసాన్ని సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆమోదించడం జరిగింది.
• భక్తులకు అందజేసే కైలాసకంకణాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించేందుకు తీర్మానించడం జరిగింది. ఈ కైలాస కంకణాల రూపకల్పనకు ధర్మకర్తల మండలి ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
• అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్లో భాగంగా మురుగునీటిని శుద్ధి చేసేందుకై ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఆపరేషన్ చార్జీలకు సంబంధించి టెండర్లను పిలవాలని నిర్ణయించడం జరిగింది.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ