తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల
తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ జాగృతి సంస్థ ప్రజా బడ్జెట్ను ప్రకటించింది. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ భారీ కేటాయింపులు ప్రతిపాదించింది.
విద్యారంగానికి రూ.30 వేల కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించాలని సూచించింది. యూనివర్సిటీ విద్యాభివృద్ధికి రూ.2 వేల కోట్లు ప్రతిపాదించింది. వృద్ధులు, వికలాంగులు సహా ఇతర పింఛన్ల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని పేర్కొంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ల కోసం రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని సూచించింది.
యువత సాధికారత కోసం 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీల పంపిణీకి రూ.5 వేల కోట్లు, 16 లక్షల మంది యువతకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా సాయం అందించేందుకు రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించేందుకు రూ.35 వేల కోట్లు కేటాయించాలని పేర్కొంది.
సామాజిక న్యాయం దిశగా బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు, ఎస్సీలకు రూ.18 వేల కోట్లు, ఎస్టీలకు రూ.10 వేల కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదించింది.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం అందించేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సూచించింది. ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.10 కోట్లు ప్రతిపాదించింది.
అదేవిధంగా, 50 ఏళ్లు నిండిన కళాకారులకు పెన్షన్ పథకం కింద లక్ష మందికి సాయం అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక సంక్షేమం దిశగా ఈ ప్రజా బడ్జెట్ ఉపయోగపడుతుందని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు.