తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుమల: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ–రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని సంకల్పించి సాయంత్రం దర్శనానికి వెళ్లారు.
పవన్ కళ్యాణ్ వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.