విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు
400 కు పైగా కోళ్లు మృతి!
మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా
బోర్లు నడవక, నీరు అందక కోళ్లు మృత్యువాత
ప్రకృతి వైపరీత్యానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడైతే అన్నదాతకు ఎంతటి తీరని నష్టం జరుగుతుందో నిరూపించే విషాదకర సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతకు, తాగునీరు అందక పలు కోళ్ల ఫారంలో దాదాపు 400కు పైగా కోళ్లు మృతి చెందాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాలనరసింహస్వామి దేవస్థానం సమీపంలో కంభంపాటి సైదులు, ఐలాపురం ముత్యాలు అనే రైతులకు చెందిన కోళ్ల ఫారం ఉంది. కాగా, మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడ్డాయి. దీంతో కోళ్ల ఫారానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో బోర్లు పనిచేయలేదు. తీవ్రమైన ఉక్కపోతకు తోడు, చుక్క నీరు కూడా అందకపోవడంతో కళ్ల ముందే కోళ్లు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. లక్షల్లో నష్టం వాటిల్లిందివీ అని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే తమకు ఈ ఘోర నష్టం తప్పేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.