విస్సన్నపేటలో రాజకీయ చేరికలు…
విస్సన్నపేటలో రాజకీయ చేరికలు… సిపిఐకి గుడ్బై చెప్పిన మేకల కుమారి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల కేంద్రంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక నాయకురాలు మేకల కుమారి సిపిఐ పార్టీకి రాజీనామా చేసి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరారు. ఆమె చేరికను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ పత్రికా సమావేశంలో స్వాగతించారు.
ఈ సందర్భంగా మేకల కుమారి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష కూటమిని మరింత బలపరిచేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.
హరినాథ్ మాట్లాడుతూ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో వామపక్ష కూటమి భాగంగా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందన్నారు.
అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రపంచ శాంతి కోసం యుద్ధాలను నిలిపివేయాలని కోరారు.
మార్చి 23న షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పరికళ కళావతి, వేముల బక్కయ్య, టి. అరుణ, భవాని, హరిచంద్ తదితరులు పాల్గొన్నారు.