ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ మృతి చెందడం పట్ల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని కోల్పోవడం పోలీసు శాఖకు తీరని లోటని ఆమె పేర్కొన్నారు. మరియదాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన హోంమంత్రి, ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరియదాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ఆకాంక్షించారు.