భీమడోలులో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు
భీమడోలు, జూలై 22: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డయల్-112, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా భద్రత, బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు భీమడోలు ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం ద్వారా బాలబాలికలకు లభించే రక్షణ, లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాల్సిన అవసరాన్ని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించాలని సూచించారు.
సోషల్ మీడియా వినియోగంలో అపరిచితుల పరిచయాలు, ఆన్లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అవి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని తెలిపారు. అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఉపయోగించాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.