చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి బంగారు నానుత్రాడు దోచిన నిందితుడు అరెస్ట్
ఏలూరు, జూలై 22: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో వృద్ధ మహిళ మెడలోని బంగారు నానుత్రాడును లాక్కొని పరారైన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూలై 15న ఉదయం సుమారు 10:30 గంటలకు శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్దకు వచ్చిన వ్యక్తి చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి, ఆమె మెడలో ఉన్న సుమారు రూ.1 లక్ష విలువైన 18.430 గ్రాముల బంగారు నానుత్రాడును బలవంతంగా లాక్కొని హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ కే.పీ.ఎస్. కిషోర్ పర్యవేక్షణలో, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ సూచనలతో, ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం గాలింపు చేపట్టి భైరవపట్నం గ్రామానికి చెందిన అగొల్లు నాగ కార్తీక్ (25)ను జూలై 22న అరెస్ట్ చేసింది.
నిందితుడి వద్ద నుంచి 18.430 గ్రాముల బంగారు నానుత్రాడు మరియు ఏపీ 28 బీవై 6517 నంబర్ గల హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించిన డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.