బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి
బీ.ఎస్.ఎన్.ఎల్, వొడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి
నెట్వర్క్ బలోపేతం కోసం వ్యూహాత్మక ఒప్పందం
దేశీయ టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బి.ఎస్.ఎన్.ఎల్ (BSNL) మరియు ప్రైవేట్ రంగ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తమ వనరులను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రెండు సంస్థలు తమ వద్ద ఉన్న మొబైల్ టవర్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను సంయుక్తంగా వినియోగించుకోనున్నాయి. నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు తమ వద్ద ఉన్న స్పెక్ట్రమ్ ని కూడా పరస్పరం పంచుకోనున్నారు. విడివిడిగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే భారీ వ్యయాన్ని తగ్గించుకోవడమే ఈ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందం వల్ల రెండు నెట్వర్క్ల పరిధి పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు తొలగి, కాల్ డ్రాప్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంటర్నెట్ వేగంతో పాటు నెట్వర్క్ నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి సంస్థల పోటీని తట్టుకునేందుకు ఈ వ్యూహం ఎంతగానో దోహదపడనుంది.