గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిల్లా వాసులకు కలెక్టర్ అభినందనలు
తల్లి–కూతుళ్ల ప్రతిభకు ప్రశంసలు.. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు
మంచిర్యాల, జూన్ 6: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మే 29న నిర్వహించిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించిన జిల్లా వాసులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. శనివారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్లో గిన్నిస్ రికార్డు సాధించిన బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్లను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్న గిన్నిస్ అచీవర్స్ మీట్లో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషమన్నారు. అందులో మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లి–కూతుళ్లు బొడ్డు కవిత, బొడ్డు అన్విత ఏంజిల్ ఎంపికై గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. వారి ప్రతిభ మరెంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాజలింగు తదితరులు పాల్గొన్నారు.