గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి..
గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ఎండిపోయిన బావులు, అల్లాడుతున్న ప్రజలు!
దండేపల్లి, ఏప్రిల్ 19:
దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ఈడిగేవాడ కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. వేసవి ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, గ్రామంలోని బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఒక్క బావిపైనే వందలాది మోటార్లు వేసి నీటిని తోడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.
తమ ప్రాంతంలో నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, తక్షణమే స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తమ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు