కన్నేపల్లి, నెన్నెల మండలాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీ
కన్నేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల ఖచ్చితమైన సమయపాలన పాటించాలని ఆదేశించారు. అలాగే వర్షాకాలం సమీపిస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం కన్నేపల్లి, నెన్నెల మండల కేంద్రాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) సందర్శించి, అక్కడ కొనసాగుతున్న భోజనశాలలు, ప్రహరీ గోడ మరియు అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్మాణ పనులన్నింటినీ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు