మంచిర్యాల: కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలకం – సీపీ అంబర్ కిషోర్ ఝా
నేరస్థులకు శిక్ష పడటంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పలు కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ సిబ్బందిని, కోర్టు లైజనింగ్ అధికారులను సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ... ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, శారీరక దాడులు వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిందితులకు తగిన శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని, సమాజంలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు