మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి - రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
విస్సన్నపేట మండలంలో రైతుల పరిస్థితి తీవ్రంగా ఉందని, రైతులు తమ మొక్కజొన్న పంటను పండించేసి ఈ సమయంలో ప్రభుత్వ మద్దతు ధరను అందక, దళారులకు తక్కువ ధరకు అమ్మవలసి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 1000 ఎకరాలు మొక్కజొన్న పంట రైతులు పండించారని, గతంలో వచ్చిన అకాల వర్షాలు వలన పంట నష్టపోయింది. ప్రస్తుతం విత్తనాల ధర పెరగడం, ఇతర ఖర్చులు అధికంగా ఉండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉన్నప్పటికీ, ప్రైవేట్ దళారులు 1400 నుండి 1800 మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. ఇది రైతుల జీవితాన్ని మరింత కష్టంలో ముంచింది. ఇదే సమయంలో, ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా రైతులు నష్టాన్ని తగ్గించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది.
అంతేకాకుండా, రైతులు నష్టపరిహారం అందించాలని కూడా కోరారు. ఈ విషయంపై విస్సన్నపేట మండల అగ్రికల్చర్ అధికారి శశికళకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి పులిబల్ల, ఏడుకొండలు కెవిపిఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
రైతుల భవిష్యత్తు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం సభ్యులు అభ్యర్థించారు.