పంచాంగ శ్రవణం… ఉగాది పర్వదినంలో శుభఫలాల వెల్లువ!
ఉగాది పండుగకు ప్రత్యేకమైన ఆచారాలలో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ప్రధానమైనవి. వేపపువ్వుతో చేసే ఉగాది పచ్చడిని తినడం వెనుక గొప్ప ఆరోగ్య, ఆధ్యాత్మిక భావన ఉంది. “శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ…” అనే శ్లోకం ప్రకారం వేపపచ్చడి సేవించడం వలన దృఢమైన ఆరోగ్యం, సంపద, అరిష్టాల నివారణ కలుగుతాయని విశ్వాసం. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శాస్త్రోక్తంగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడిన పంచాంగం మన జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. “తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనం…” అనే శ్లోకం ప్రకారం తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల రోగ నివారణ, కరణం వల్ల కార్యసిద్ధి లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే సంవత్సరంలో గ్రహాల ప్రభావం, శుభ ముహూర్తాలు, కాల పరిమాణాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక గ్రహదోషాలు తగ్గి శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. “శ్రీకల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం…” అనే శ్లోకం ప్రకారం పంచాంగ శ్రవణం గంగాస్నానం చేసినంత పుణ్యం, గోదానం చేసిన ఫలితం ఇస్తుందని, ఆయుర్దాయం పెంచి సంపద, సంతాన వృద్ధికి దోహదపడుతుందని విశ్వాసం. పంచాంగ శ్రవణానంతరం జ్యోతిష్కులను, పురోహితులను సత్కరించడం ద్వారా మరింత శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మొత్తానికి పంచాంగ శ్రవణం కేవలం ఆచారం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని అందించే శుభప్రదమైన విధానమని భక్తులు విశ్వసిస్తున్నారు.