పోతనపల్లిలో నాటు సారాపై ఎక్సైజ్ దాడులు
పోతనపల్లిలో నాటు సారాపై ఎక్సైజ్ దాడులు – ఒకరు అరెస్ట్, వాహనం స్వాధీనం
నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు “నవోదయం 2.0” కార్యక్రమం కింద ప్రత్యేక దాడులు నిర్వహించారు.
అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.హెచ్. అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి.ఎస్.డి. భోగేశ్వరరావు మరియు సిబ్బంది చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండ గ్రామంలో దాడులు చేపట్టారు.
ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ధరావతు శ్రీను (తండ్రి మస్తాన్)ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి 5 లీటర్ల నాటు సారా మరియు టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా సారా తయారీకి అవసరమైన బెల్లాన్ని చింతలపూడి గ్రామానికి చెందిన వజ్రపు సీతా మహేశ్వరరావు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.
అధికారులు హెచ్చరిస్తూ, నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ, అలాగే బెల్ట్ షాపుల నిర్వహణ నేరమని స్పష్టం చేశారు. సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊట నిల్వ ఉంచే భూ యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు 9440902462 నంబర్కు సమాచారం ఇవ్వవచ్చని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు పేర్కొన్నారు.