ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధితో మెరుగైన వైద్య సేవలు
ఆసుపత్రుల అభివృద్ధి సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ఆసుపత్రుల అభివృద్ధి సంఘం సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకులు వేదవ్యాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి అభివృద్ధి పనుల కోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆసుపత్రి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం, నిర్వహణ, అంబులెన్స్ సేవలు తదితర అంశాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు, వైద్య పరికరాల కొనుగోలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.2.88 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించిన కలెక్టర్, నర్సులు, భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి వార్డులు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని, పరిసరాల్లో ఉమ్మివేసే వారిపై జరిమానాలు విధించాలని సూచించారు. ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన అదనపు సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.