ప్రపంచ మార్కెట్పై కోమన్నూతల అరటి గురించి రైతులకు కలెక్టర్ కీలక సూచనలు
ప్రపంచ మార్కెట్పై కోమన్నూతల అరటి గురించి రైతులకు కలెక్టర్ కీలక సూచనలు
కడప, జూలై 22: కోమన్నూతల అరటికి ప్రపంచ మార్కెట్లో మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్యం, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీఓ) బలోపేతంతో రైతులు ముందుకు సాగాలని సూచించారు.
పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా లింగాల మండలం కోమన్నూతల గ్రామంలోని అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్ రైతులతో సమావేశమై సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలపై చర్చించారు.
కోమన్నూతలలో సుమారు 1,800 మంది రైతులు 3,600 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారని, ఇక్కడ పండే అరటికి దేశీయ మార్కెట్తో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఆ అవకాశాలను మరింత విస్తరించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
అరటికి విలువ ఆధారిత ఉత్పత్తులు, శీతల గిడ్డంగులు, నాణ్యమైన ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరిస్తే రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమతుల్య పోషక నిర్వహణ, సూక్ష్మ నీటి పారుదల, ఆధునిక సాంకేతికత వినియోగంతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.
రైతులు వ్యక్తిగతంగా కాకుండా సంఘటితంగా పనిచేస్తూ ఎఫ్పీఓల్లో సభ్యులుగా చేరాలని కలెక్టర్ సూచించారు. ఎఫ్పీఓల ద్వారా నాణ్యమైన ఇన్పుట్లు తక్కువ ధరలకు లభించడంతో పాటు, పంటను పెద్ద ఎత్తున విక్రయించి గిట్టుబాటు ధరలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
మహారాష్ట్రలోని సహ్యాద్రి ఫార్మ్స్ ఎఫ్పీఓ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, కోమన్నూతల రైతులు కూడా బలమైన ఎఫ్పీఓలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రేడింగ్, ప్యాకేజింగ్, శీతల నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు, దేశీయ-అంతర్జాతీయ మార్కెట్లతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా రైతులు వ్యాపారవేత్తలుగా ఎదిగి కోమన్నూతల అరటికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.