స్వచ్ఛ పథంలో మొక్కలు నాటిన కలెక్టరు క్లాప్ మిత్రాల సేవలు అభినందనీయం: కె. వెట్రిసెల్వి
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు/లింగపాలెం, జూలై 22: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం స్వర్ణగ్రామ సచివాలయంలో నిర్వహించిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం క్లాప్ మిత్రాలకు నూతన దుస్తులు అందజేసి, శాలువాలతో సన్మానించారు. వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను తెలుసుకుని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం ఎంతో అవసరమని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ పథాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు.
పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతిరోజూ అంకితభావంతో పనిచేస్తున్న క్లాప్ మిత్రాల సేవలు అభినందనీయమని కలెక్టరు పేర్కొన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్లాప్ మిత్రాల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, స్వర్ణగ్రామ–స్వర్ణవార్డు జిల్లా అధికారి జి. వెంకటనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జి.వి. మల్లిఖార్జునరావు, తహశీల్దారు నజీముల్లాషా, ఎంపీడీవో కె. వాణీ, వివిధ శాఖల అధికారులు, స్వర్ణగ్రామ ఉద్యోగులు పాల్గొన్నారు.