తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసి, జైలు జీవితం గడిపి, ఆర్థికంగా నష్టపోయిన మలిదశ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన 'తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక' సమావేశం హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో 1200 మంది అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల సేవలను పూర్తిగా విస్మరించిందని, కనీసం వారిని గుర్తించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఈ సందర్భంగా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ నాటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల ఒత్తిడికి స్పందించి ఇచ్చిన మాట ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అయితే, గతంలోలాగా పైరవీకారులకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని కోరుతూ.. ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ప్రతి నెలా ₹50,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రత్యేక గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం, 5 ఎకరాల భూమి, ఉచిత విద్యా-వైద్యం, బస్సు మరియు రైళ్లలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను ఉద్యమకారులుగా గుర్తించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించిన ఈ ప్రాముఖ్యమైన సమావేశంలో ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని, కార్యదర్శి ఏ. రాజేశం, ముఖ్య ఉద్యమకారులు సిహెచ్ రామస్వామి, సత్యనారాయణ, కె. శంకరయ్య, డి. రామస్వామి, మరియు రాయమల్లు తదితరులు పాల్గొన్నారు