విద్యతో పాటు సామాజిక, వైజ్ఞానిక అవగాహన అవసరం: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ప్రభుత్వ పాఠశాల, భవిత దివ్యాంగుల పాఠశాల తనిఖీ
ఏలూరు, జూలై 22: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం మండల పరిషత్ పాఠశాలను బుధవారం సందర్శించిన కలెక్టర్, నాలుగో, ఐదో తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థులు ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడంతో అభినందించారు.
అనంతరం పాఠశాలలో బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి విద్యార్థి విద్యలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు.
తర్వాత భవిత దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్య, వసతి, భోజనం, వైద్య సేవలు, పునరావాస సౌకర్యాలను పరిశీలించారు. దివ్యాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెన్షన్ అందడం లేదని కొందరు దివ్యాంగులు తన దృష్టికి తీసుకువచ్చారని, అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు 20 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుతున్నారని, వారు ఉన్నత విద్య పూర్తిచేసే వరకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ఫిజియోథెరపీ సేవలను క్రమం తప్పకుండా అందించి, అవసరమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఇఆర్వో వి.వి.యస్. శర్మ, తహశీల్దార్ నజీముల్లాషా, ఎంపీడీవో కె. వాణి, ప్రధానోపాధ్యాయురాలు షేక్ సాజీధా బేగం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.